AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఏప్రిల్ 14 అక్షరం న్యూస్ మనోవేదనకు గురై యువత ఆత్మహత్యల బాట పట్టడం సామాజిక ఆవేదనకు గురిచేస్తోందని, ఆత్మహత్యలు దేనికీ పరిష్కారం కావని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి మండలం హనుమంతునిపేట గ్రామంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ ఇటీవల కాలంలో కొమరే గ్రామంలో 28 ఏళ్ల యువకుడు, సిద్దిపేటలో ఎంబీబీఎస్ విద్యార్థిని వంటి ఎంతో మంది యువత చిన్న చిన్న సమస్యలకే బలవన్మరణాలకు పాల్పడటం అత్యంత బాధాకరమని అన్నారు. యువత ఇటువంటి విపత్కర నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తరహాలోనే ప్రత్యేక కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సైకాలజిస్టుల ద్వారా గ్రామీణ స్థాయిలో అవగాహన కల్పించి యువతను మనోవేదన నుంచి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ఇలాంటి టోర్నమెంట్ల ద్వారా యువకులు ఒకరినొకరు కలుస్తూ తమ భావాలను పంచుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. తన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మే 9న నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్,జ్యోతిరావు పూలే వంటి మహనీయుల పోరాటాలను గుర్తుచేస్తూ,మహిళల హక్కుల కోసం, ఆస్తి హక్కుల కోసం వారు చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు. వారి ఆశయ సాధనలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమంతునిపేట సర్పంచ్ మెడగొని శ్రీనివాస్, ఉప సర్పంచ్ మేకల కుమార్, ప్రత్యేక ఆహ్వానితులు రాజశేఖర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డిలతో పాటు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు శ్రవణ్, వెంకటేష్, కిట్టు యాదవ్, రఘు,మీడియా ఇంచార్జ్ తదితర బీసీ నాయకులు, యువకులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily